
న్యూఢిల్లీ: ఢిల్లీ గాజియాబాద్లో మరో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. కారు కట్నంగా ఇవ్వలేదని తలాక్ చెప్పాడు ఓ వ్యక్తి. వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనిపై భర్త, సహా అతడి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. గాజియాబాద్ కైలా భట్టాకు చెందిన ఇమ్రాన్కు 2017లో రుబినాతో వివాహం జరిగింది. వీరిద్దరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లైన కొద్ది రోజులకే అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడం వల్ల ఆమెను చిత్ర హింసలు పెట్టేవారు. దీంతో రుబీనా మరొక అద్దె ఇళ్లు తీసుకుని ప్రత్యేకంగా ఉంటోంది. కట్నంగా కారు తీసుకురాకపోవడం వల్ల అద్దె ఇంటికి వచ్చి మరీ ఆమెపై దాడి చేశారు.
వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లి బంగారు ఆభరణాలు తీసుకువచ్చి ఇచ్చానని.. వాటిని అమ్ముకుని మళ్లీ వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ పనిపై రాజస్థాన్ వెళ్లిన భర్త ఇమ్రాన్.. ఫోన్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు. అక్కడే మరో మహిళను పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.





