
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఒక రెస్టారెంట్లో కేవలం హలాల్ మాంసం మాత్రమే వడ్డిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మెనూలో మాంసం రకాన్ని స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారని వారు ఆరోపించారు.
జాతీయ రహదారి-12పై భట్జంగ్లా సమీపంలో ఉన్న ‘మదర్స్ హట్’ రెస్టారెంట్కు వెళ్లిన బీజేపీ కార్యకర్తలు, అక్కడ వడ్డిస్తున్న మాంసం రకంపై సిబ్బందిని ప్రశ్నించారు. తమ వద్ద కేవలం హలాల్ మాంసం మాత్రమే అందుబాటులో ఉందని సిబ్బంది తెలిపినట్లు కార్యకర్తలు పేర్కొన్నారు.
దీంతో ‘ఝట్కా’ మాంసం అందుబాటులో ఉందా అని వారు ప్రశ్నించగా, లేదని సమాధానం రావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మెనూలో వివరాలు వెల్లడించాలని డిమాండ్
వివాదం అనంతరం బీజేపీ కార్యకర్తలు రెస్టారెంట్ వెలుపల సుమారు రెండు గంటల పాటు నిరసన చేపట్టారు. మెనూ కార్డులో వడ్డించే మాంసం రకాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు, ఝట్కా మాంసాన్ని కూడా అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు.
పోలీసుల జోక్యంతో ముగిసిన ఆందోళన
సమాచారం అందుకున్న కృష్ణానగర్ కొత్వాలి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, ఇరు పక్షాలతో చర్చలు జరిపారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, ఆందోళనను శాంతియుతంగా ముగించారు.




