
ముజఫర్పూర్: బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి, తాను భారత సైన్యంలో పనిచేస్తున్నానని తప్పుడు వివరాలు చెప్పి ఓ 21 ఏళ్ల హిందూ యువతిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సక్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం, సక్రా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహమ్మద్ అర్మాన్ సోషల్ మీడియా ద్వారా యువతితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం తాను సైనికుడినని, వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, మొదటిసారి కలిసే సమయంలో అర్మాన్ సైనికుల మాదిరిగా జుట్టు కత్తిరించుకుని, మిలిటరీ యూనిఫాం ధరించి వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే వీడియో కాల్స్లో కూడా మిలిటరీ యూనిఫాం, ఆయుధాలు చూపిస్తూ తాను విధుల్లో ఉన్న సైనికుడినని నమ్మించాడని ఆరోపించారు.
పాకిస్థాన్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నానని, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఉన్నానని చెబుతూ అత్యవసర అవసరాల పేరుతో పలుమార్లు ఆన్లైన్లో యువతి నుంచి డబ్బు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తరువాత అతను సైనికుడు కాదని, ఇప్పటికే వివాహితుడని, స్థానికంగా సైకిల్ రిపేర్ షాపులో పనిచేస్తున్నాడని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఆరుగురిపై కేసు నమోదు
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ప్రధాన నిందితుడు మహమ్మద్ అర్మాన్తో పాటు మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
పోలీసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆరోపణలపై నిందితుల వాదన ఇంకా వెలువడాల్సి ఉంది.





