
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన ప్రతిసారి భక్తుల్లో ఒక ప్రశ్న తప్పక తలెత్తుతుంది. గుహలోని మంచు శివలింగం ఏటా సహజంగా ఎలా ఏర్పడుతుందన్నదే ఆ ప్రశ్న. కోట్లాది మంది భక్తులకు అది పరమశివుడి దివ్య స్వరూపం. అదే సమయంలో శాస్త్రవేత్తలు ఈ ఆధ్యాత్మిక అద్భుతం వెనుక ఆసక్తికరమైన భౌగోళిక ప్రక్రియ ఉందని చెబుతున్నారు.
శివలింగం ఎలా ఏర్పడుతుంది?
శ్రీనగర్కు ఈశాన్యంగా సుమారు 145 కిలోమీటర్ల దూరంలో, దాదాపు 4,000 మీటర్ల ఎత్తులో అమర్నాథ్ గుహ ఉంది. గుహపై ఉన్న సున్నపురాయి, జిప్సం శిలల పగుళ్ల ద్వారా హిమనదాలు, మంచు కరిగిన నీరు నెమ్మదిగా గుహలోకి చేరుతుంది. లోపల మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా ఆ నీరు ఒక్కో పొరగా గడ్డకడుతుంది. ఇలా పొరపై పొర ఏర్పడుతూ పైకి ఎదిగే మంచు స్తంభమే భక్తులు దర్శించే మంచు శివలింగం. భూగర్భ శాస్త్రంలో దీనిని ‘ఐస్ స్టాలాగ్మైట్’ అని పిలుస్తారు.
ఎందుకు మళ్లీ కరిగిపోతుంది?
పౌర్ణమి వరకు మంచు శివలింగం క్రమంగా పెరిగి, తర్వాత అమావాస్య వచ్చేకొద్దీ చిన్నదవుతుందనే విశ్వాసం ఉంది. దీనికి ఉష్ణోగ్రతలు కూడా ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యాత్ర సమయంలో వేలాది మంది భక్తులు గుహలోకి రావడంతో లోపలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాంతో మంచు వేగంగా కరుగుతుంది. అంతేకాదు మంచు కురిసిన పరిమాణం, హిమనదాల కరుగుదల, గుహలోని వాతావరణం కూడా శివలింగం పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయి.
శాస్త్రానికి విరుద్ధం కాదు
అమర్నాథ్ గుహలోనే పరమశివుడు పార్వతీదేవికి సృష్టి రహస్యం, అమరత్వ రహస్యాన్ని వివరించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ విశ్వాసమే అమర్నాథ్ను అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా నిలబెట్టింది. అయితే, శాస్త్రం ఈ మంచు శివలింగం ఎలా ఏర్పడుతుందో మాత్రమే వివరిస్తుందని, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఏమాత్రం తగ్గించదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలోని అనేక పవిత్ర క్షేత్రాల మాదిరిగానే అమర్నాథ్లోనూ ప్రకృతి, విశ్వాసం కలిసే అద్భుత దృశ్యమిదేనని పేర్కొంటున్నారు.





