News

సోమనాథ్ స్ఫూర్తితో కైలాసగిరి అభివృద్ధి : పి.వి.ఎన్.మాధవ్

6views

విశాఖలోని కైలాసగిరిపై త్రిశూలాన్ని ఏర్పాటు చేయడం ఒక శుభ పరిణామమని అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ అన్నారు. నగరంలోని కైలాసగిరి వేదికగా జరిగిన ‘స్వాభిమాన్ పర్వ’ కార్యక్రమం ఆధ్యాత్మికత, జాతీయ భద్రత అంశాల కలయికగా సాగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పి.వి.ఎన్ మాధవ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొని, దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలు, సాంస్కృతిక పునరుజ్జీవనంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా పి.వి.ఎన్ మాధవ్ మాట్లాడుతూ.. ‘సింహాచలం క్షేత్రంలో భాగమైన కైలాసగిరిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో VMRDA చేపట్టిన త్రిశూల్ ప్రాజెక్ట్ అభినందనీయం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ స్వాభిమాన్ జాగరణ కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా, దేశ రక్షణ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. గత పన్నెండేళ్ల కాలంలో పఠాన్‌కోట్ మినహా దేశంలో పెద్దగా ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకోకపోవడం.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో అంతర్గత భద్రత ఎంత పటిష్టంగా ఉందో నిరూపిస్తోంది. ముఖ్యంగా ‘ఆపరేషన్ కగార్’ ద్వారా దేశవ్యాప్తంగా తీవ్రవాద ఏరివేత ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఎన్డీయే హయాంలో దేశ సరిహద్దులు మరింత సురక్షితంగా మారాయి’ అని అన్నారు.