
దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందిన శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంలో వెలసిన ముఖలింగేశ్వరస్వామికి ఆలయం స్థాపించిన నుంచి నేటి వరకు కుంభాభిషేకం జరగకపోవడం బాధాకరమని ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. సేవ్ టెంపుల్స్ ఇండియా అధ్యక్షులు, గాయకులు గజల్ శ్రీనివాస్తో కలిసి సోమవారం శ్రీముఖ లింగేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ సాంప్రదాయ పరిరక్షణలో భాగంగా శ్రీముఖలింగేశ్వరునికి త్వరితగతిన కుంభాభిషేకం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు దేవాలయాలు మూలస్తంభాలని వాటిని పరిరక్షించే బాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ శివప్రసాద్ పాడి, అర్చకులు వారికి శ్రీముఖలింగేశ్వరస్వామి చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో జలుమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తర్ర బలరాం, మాజీ సర్పంచ్ తమ్మన్నగారి సతీష్, అర్చకులు పాల్గొన్నారు.





