
అసలేం జరిగింది?:
గత మార్చి 15న కొందరు ముస్లిం యువకులు గంగా నదిలో ఒక పడవను అద్దెకు తీసుకుని ఇఫ్తార్ పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో వారు పడవపైనే చికెన్ బిర్యానీ తింటూ, తిన్న తర్వాత మిగిలిన ఎముకలను మరియు ఆహార వ్యర్థాలను పవిత్ర గంగా నదిలో పడేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సనాతన ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే గంగా నదిలో ఇలా మాంసాహారం తిని వ్యర్థాలు పడేయడం హిందూ సమాజం యొక్క మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది.
దీనిపై భారతీయ జనతా యువ మోర్చా (BJYM) నగర అధ్యక్షుడు రజత్ జైస్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మార్చి 17న 14 మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
కోర్టు ఏమన్నదంటే?గతంలో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టు వీరి బెయిల్ పిటిషన్లను తిరస్కరించగా, నిందితులు జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులు ఈ దారుణమైన చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చూస్తుంటే.. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వక చర్యగా ప్రాథమికంగా అర్థమవుతోందని జడ్జి పేర్కొన్నారు.
మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టి, వాటిని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయడం నేరం యొక్క తీవ్రతను మరింత పెంచుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
పోలీసులు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మతపరమైన విశ్వాసాలను అవమానించడం, ప్రజల మనోభావాలను గాయపరచడం (Section 299), వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం (Section 196), పబ్లిక్ న్యూసెన్స్ (Section 270) మరియు జలాశయాన్ని కలుషితం చేయడం (Section 279) వంటి తీవ్రమైన అభియోగాలు వీరిపై మోపారు. నేరం యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకుని కోర్టు వీరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది





