
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న అత్యంత క్లిష్టమైన యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, భారత దౌత్య యంత్రాంగం అనుసరిస్తున్న వ్యూహాలు దేశానికి భారీ ఊరటను ఇస్తున్నాయి. భారత ఫ్లాగ్ తో ఉన్న నౌకలకు హార్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మధ్య నిరంతరం చర్చలు సాగుతున్నాయి. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు మూడుసార్లు కీలకమైన చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన ఫోన్కాల్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హార్ముజ్ జలసంధి గుండా భారత నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడటమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశ్యం. అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాలకు చెందిన నౌకలు హార్మూజ్ ఆంక్షల ముప్పును ఎదుర్కొంటున్న తరుణంలో, భారత జెండాతో ఉన్న పుష్పక్ , పరిమళ్ వంటి భారీ ట్యాంకర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుతుండటం జైశంకర్-అరాగ్చీల మధ్య జరిగిన దౌత్య చర్చల విజయానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ దౌత్య ప్రయత్నాలు కేవలం ఇరాన్తోనే ఆగిపోలేదు. జైశంకర్ రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో పాటు ఐరోపా సమాఖ్యకు చెందిన కీలక నేతలతో ఫోన్లో మాట్లాడారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రస్తుత యుద్ధం చూపుతున్న తీవ్ర ప్రభావాన్ని, ముడిచమురు, గ్యాస్ ధరల పెరుగుదలను ఎలా అదుపు చేయాలనే అంశాలపై వారు లోతుగా చర్చించారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని భారత్ హెచ్చరించింది.
రష్యాతో సంప్రదింపులు జరపడం ద్వారా, ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను, దౌత్యపరమైన ఒత్తిడిని భారత్ పెంచుతోంది. దేశంలో ఇప్పటికే ఎల్పీజీ , సీఎన్జీ కొరత నెలకొన్న తరుణంలో, ఈ ట్యాంకర్లు సురక్షితంగా భారత్కు చేరుకోవడం వల్ల సామాన్యులకు ఇంధన ధరల భారం తగ్గడమే కాకుండా, పారిశ్రామిక అవసరాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది.





