News

ఆపరేషన్ సిందూర్ పేరుతో కొత్త గులాబీ పువ్వు జాతి

105views

గ‌త ఏడాది మే నెల‌లో ఆప‌రేష‌న్ సిందూర్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌తీయ బ‌ల‌గాలు ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టాయి. ఈ ఆప‌రేష‌న్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర‌వాద క్యాంపుల‌ను ధ్వంసం చేశారు. అప్పటి నుండి దేశం మొత్తం ఆపరేషన్ సిందూర్ పేరు మారుమోగిపోతోంది. తాజాగా ఆపరేషన్ సిందూర్ పేరుతో ఓ కొత్త త‌ర‌హా గులాబీ పువ్వు జాతిని సృష్టించారు.

బెంగాల్‌కు చెందిన ప్ర‌ఖ్యాత రోజ్‌బ్రీడ‌ర్ ఆ గులాబీ పువ్వుల‌కు ప్రాణం పోశాడు. కోల్‌క‌తాకు చెందిన రోజ్‌బ్రీడ‌ర్ ప్ర‌ణ‌బీర్ మైతీ ఈ కొత్త త‌ర‌హా ఆప‌రేష‌న్ సింధూర్ గులాబీ జాతి పువ్వుల‌ను ఖ‌ర‌గ్‌పూర్‌లోని గార్డెన్‌లో డెవ‌ల‌ప్ చేశారు. రోజ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్ర‌ణ‌బీర్‌కు గుర్తింపు ఉంది. భార‌త సైనిక బ‌ల‌గాలు ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో ప్ర‌ద‌ర్శించిన తెగువ‌, త్యాగానికి ప్ర‌తీక‌గా ఆప‌రేష‌న్ సింధూర్ జాతి గులాబీ పువ్వుల‌ను పెంచిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే ఈ వెరైటీ పువ్వుల‌కు చెందిన ఫోటోల‌ను ఆర్మీకి చెందిన ఈస్ట్ర‌న్ క‌మాండ్ త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది.

గులాబీ పువ్వుల‌తో బ్రీడింగ్ చేస్తున్న ప్ర‌ణ‌బీర్ మైతీ.. హార్టీక‌ల్చ‌ర్‌లో చాలా పేరున్న వ్య‌క్తి. అత‌ని వ‌ద్ద ఉన్న గార్డెన్స్‌లో సుమారు మూడు వేల వెరైటీ గులాబీ జాతి మొక్క‌లు ఉన్నాయి. గ‌త 30 ఏళ్ల నుంచి ప్ర‌ణ‌బీర్ కొన్ని డ‌జ‌న్ల సంఖ్య‌లో కొత్త త‌ర‌హా బ్రీడ్‌ల‌ను డెవ‌ల‌ప్ చేశాడు.