
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ‘బాబ్రీ స్మారక చిహ్నం’ నిర్మిస్తామంటూ తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అధ్యక్షుడు ముస్తాక్ మాలిక్ చేసిన ప్రకటన తెలంగాణలో కొత్త రాజకీయ దుమారం రేపింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 6న జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు.
తెలంగాణ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా కూడా ఉన్న ముస్తాక్ మాలిక్ మాట్లాడుతూ.. కూల్చివేసిన బాబ్రీ మసీదుకు గుర్తుగా ఓ స్మారక చిహ్నంతో పాటు కొన్ని సంక్షేమ సంస్థలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఇలాంటి ప్రయత్నమే జరిగిందని గుర్తుచేశారు. బాబర్ పేరు చుట్టూ జరుగుతున్న చర్చ దేశాన్ని విభజించేందుకు చేస్తున్న రాజకీయ ప్రచారమని ఆయన కొట్టిపారేశారు.
ముస్తాక్ మాలిక్ ప్రకటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన, రెచ్చగొట్టే చర్య అని ఆ పార్టీ విమర్శించింది. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాత, ఇలాంటి ప్రకటనలు మత ఘర్షణలను ప్రేరేపించేలా ఉన్నాయని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. బాబర్ పేరుతో ఎలాంటి స్మారక చిహ్నాన్ని దేశం అంగీకరించదన్నారు.
ఈ వివాదంపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. ప్రభుత్వ మౌనం ఇలాంటి శక్తులను ప్రోత్సహించినట్లు అవుతుందని విమర్శించింది. ఈ పరిణామం దశాబ్దాల నాటి వివాదాన్ని మరోసారి రాజకీయ చర్చకు తీసుకువచ్చింది.





