News

హరిద్వార్‌లో బజరంగ్ దళ్ నిర్వహిస్తున్న ర్యాలీపై రాళ్ల దాడి

197views

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జ్వాలాపూర్‌ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బజరంగ్‌ దళం నిర్వహించిన శౌర్య యాత్రపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బజరంగ్‌ దళ కార్యకర్తలకు పోలీసులు హామీ ఇచ్చారు.

అయితే, సాయంత్రం హరిద్వార్‌లోని మూడు ప్రాంతాల నుంచి శౌర్య యాత్రలు నిర్వహించారు. ఈ యాత్ర జ్వాలాపూర్‌లోని రాం చౌక్‌కు చేరుకున్న వెంటనే రాళ్ల దాడి జరిగింది. ఇదే సమయంలో కొంతమంది కార్యకర్తలు ఒక బుల్డోజర్‌తో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుందని తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటన ప్రదేశానికి భారీగా బలగాలను మోహరించి అక్కడ పరిస్థితిని నియంత్రించారు. ఇక, హరిద్వార్‌ సిటీ ఎస్పీ అభయ్‌ ప్రతాప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఈ సంఘటనకు సంబంధించిన దుండగులపై కేసు నమోదు చేశాం.. వీడియోల ద్వారా ఆధారాలను సేకరించి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇక, బజరంగ్‌ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు అనుజ్‌ వాలియా మాట్లాడుతూ.. యాత్ర రాం చౌక్‌కు చేరుకున్నప్పుడు కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. హరిద్వార్‌లో చట్టం- ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. బజరంగ్‌ దళ్ చేపట్టిన ర్యాలీపై దాడులు జరగడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.