News

మహాబలిపురం తీరానికి కొట్టుకొచ్చిన ‘బలి పీఠం’

239views

మహాబలిరంలోని తమిళనాడు టూరిజం డెవలప్‏మెంట్‌ కార్పొరేషన్‌ హోటల్‌ వెనుక ఉన్న బీచ్‌లో మంగళవారం రాతి బలి పీఠం శిల్పం కొట్టుకు వచ్చిందని కొందరు పురావస్తు శాఖకు సమాచారం అందించారు. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో సముద్రపు ఆలయం, ఐదు రథాలు, పల్లవ రాజుల పురాతన స్మారక చిహ్నాం, అర్జునుడి తపస్సు, వెన్నముద్దరాయి తదితరాలను పురావస్తు శాఖ పర్యవేక్షిస్తోంది.

ఈ క్రమంలో, ప్రస్తుతం బీచ్‌లో ఉన్న గుహాలయం లాగానే, చాలా సంవత్సరాల క్రితం మరికొన్ని దేవాలయాలున్నాయని, సముద్రపు అలలు, ఆటుపోట్ల కారణంగా ఈ దేవాలయాలు సముద్రంలో మునిగాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో గత నెలలో పరిశోధకులు సముద్రంలో నిర్వహించిన సర్వేలో, ఒక పురాతన నగరం రాతి స్తంభాలు, మందిరాలు వంటివి కనుగొన్నారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు హోటల్‌ వెనుక బీచ్‌లో బలిపీఠం శిల్పం తీరానికి కొట్టుకొచ్చింది. సమాచారం అందుకుని అక్కడకు చేరుకున్న పురావస్తు శాఖ అధికారులు, సముద్రంలో కలిశాయని భావిస్తున్న ఆలయాలకు చెందిన శిల్పమా? ఎవరైనా చోరీ చేసి ఇక్కడ పడేశారా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.