News

భారత్‌, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం: పాక్‌ ఆర్మీ చీఫ్‌ అనుచిత వ్యాఖ్యలు

156views

దాయాది దేశం పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగారు. పాకిస్తాన్‌ వద్ద క్షిపణులకు లోటు లేదంటూనే.. తమ నాశనం అంటూ జరిగితే.. పాక్‌తో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కుక్క తోక వంకర అన్న చందంగా.. పాక్‌ వైఖరి ఎప్పటికీ మారదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌.. అమెరికా పర్యటనలో ఉన్నారు. ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో మునీర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. అక్కడ ఉన్న పాక్‌ పౌరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్‌పై నోరుపారేసుకున్నారు. కార్యక్రమంలో మునీర్‌ మాట్లాడుతూ..‘మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. మా వద్ద క్షిపణులకు లోటు లేదు. అవసరమైతే అణు యుద్ధానికి దిగుతాం. సింధూ నదిపై భారత్ డ్యామ్‌లు నిర్మించే వరకు మేం ఎదురుచూస్తాం. వారు కట్టే ఆనకట్టలను 10 క్షిపణులతో పేల్చేస్తాం. ఒకవేళ భవిష్యత్తులో భారత్‌ నుంచి మా అస్థిత్వానికి ముప్పు ఎదురైతే.. మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో, వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉండగా.. భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతల మంటలు ఇంకా చల్లారక ముందే ఆర్మీ చీఫ్ హెచ్చరికలు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు అణు దాడి బెదిరింపులు విసురుతోంది. దీంతో, మరోసారి భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉంది. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అండతోనే పాకిస్తాన్‌ ఇలా రెచ్చిపోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.