News

పాకిస్థాన్‌ ‘కవర్‌ అప్‌’ ఆపరేషన్‌ .. నష్టం వాటిల్లిన ఎయిర్‌ బేసులపై టార్పాలిన్లు, షీట్లు

226views

పాకిస్థాన్‌ ‘కవర్‌ అప్‌’ ఆపరేషన్‌ చేపట్టింది. గత నెలలో భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దాడుల్లో ధ్వంసమైన ఎయిర్‌బేస్‌ స్థావరాలపై టార్పాలిన్లు, షీట్లు వంటివి కప్పింది. భారత్‌ దాడుల్లో జరిగిన నష్టాన్ని కవర్‌ చేసేందుకు పాక్‌ ప్రయత్నించింది. శాటిలైట్‌ చిత్రాలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. భారీగా దెబ్బతిన్న మురిద్, జాకోబాబాద్, భోలారి ఎయిర్‌బేస్‌ స్థావరాలపై టార్పాలిన్లు, షీట్లు వంటి వాటిని పాకిస్థాన్‌ కప్పింది.

కాగా, భారత్‌ వైమానిక దాడుల్లో సింధ్‌లోని భోలారి ఎయిర్ బేస్‌ బాగా దెబ్బతిన్నది. అయితే ధ్వంసమైన హ్యాంగర్ పైకప్పును టార్పాలిన్‌తో కప్పి ఉంచడాన్ని జూన్ 4న మాక్సర్ టెక్నాలజీస్ నుంచి సేకరించిన హై రిజల్యూషన్ ఇమేజ్‌లు స్పష్టం చేశాయి. ఇంటెల్ ల్యాబ్‌లోని జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ తొలుత దీనిని గుర్తించారు.

మరోవైపు పాకిస్థాన్‌ పంజాబ్‌లోని మురిద్ ఎయిర్‌బేస్‌లో ధ్వంసమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌పై ఆకుపచ్చని టార్పాలిన్ కప్పారు. అక్కడి రన్‌ వేపై ఏర్పడిన పెద్ద గొయ్యిని పూడ్చివేశారు. అలాగే ఎఫ్‌-16లకు నిలయమైన జాకోబాబాద్‌లోని బేస్ షెహ్‌బాజ్‌లో మరమ్మతు పనులు చేపట్టారు. ధ్వంసమైన స్థావరాలు కనిపించకుండా కవర్లు కప్పినట్లు జూన్‌ 4 నాటి శాటిలైట్‌ చిత్రాలు నిర్ధారించాయి.