
పాక్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ కింద భారత్ తొలి దాడి చేసిన రోజు అది. సరిహద్దుల వద్ద బీఎ్సఎఫ్ పకడ్బందీగా కాపలా కాస్తోంది. కాస్త చీకటిపడగానే పాకిస్థాన్ వైపు కదలికలు మొదలయ్యాయి. సియాల్కోట్ ప్రాంతంలో సుమారు 40-50 మంది ఉగ్రవాదుల గుంపు భారత్లోకి చొరబడేందుకు సరిహద్దుల వైపు వస్తున్నట్టు బీఎస్ఎఫ్ గుర్తించింది. ఆ ఉగ్రవాదులు చొరబడేందుకు వీలుగా.. పాక్ దళాలు ఉన్నట్టుండి భారత సైనిక పోస్టులపై కాల్పులు జరపడం మొదలుపెట్టాయి. అప్పటికే అప్రమత్తంగా ఉన్న బీఎస్ఎఫ్ దళాలు.. దీటుగా స్పందించాయి. పాక్ ఆర్మీ సాధారణ పోస్టులు, వ్యూహాత్మక(ఫార్వర్డ్) పోస్టులతోపాటు ఉగ్రవాదుల ల్యాంచ్ప్యాడ్లపై గుళ్ల వర్షం కురిపించాయి. పాకిస్థాన్ భూభాగంలో సుమారు 2.2 కిలోమీటర్ల లోపల ఉన్న అడ్డాలను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో సరిహద్దులు దాటి వెళ్లి, పాక్ భూభాగం మీద నుంచీ దాడి చేశాయి. ఈ ధాటికి తట్టుకోలేక పాక్ సైనికులు పారిపోయారు. బీఎస్ఎఫ్ జమ్మూ ఫ్రాంటియర్ ఐజీ శశాంక్ ఆనంద్ మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు. మన దళాల దాడి, పాక్ రేంజర్లు పారిపోతున్న దృశ్యాల వీడియోను కూడా విడుదల చేశారు. పాక్లోని లూని, మస్త్పూర్, ఛబ్రా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశామని తెలిపారు. మొత్తంగా పాక్కు చెందిన 76 పోస్టులు, 42 ఫార్వర్డ్ డిఫెన్స్ లొకేషన్లపై దాడి చేశామని వెల్లడించారు. ఈ దాడుల్లో బీఎ్సఎస్ మహిళా దళాలు ధైర్యంగా పాల్గొన్నాయని ఐజీ ఆనంద్ ప్రశంసించారు.





