News

వక్ఫ్ బిల్లు సవరణ చట్టంపై తీర్పు రిజర్వ్..

272views

వక్ఫ్ బిల్లు సవరణ చట్టం-2025 రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టును రిజర్వ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో మూడు ముఖ్యమైన అంశాలపై అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా కోర్టులు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను తిరిగి డీనోటిఫై చేసే అధికారంపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వాదనలు ఆసక్తికరంగా సాగాయి. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఈ చర్చల సమయంలో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ.. వక్ఫ్ అనేది దేవునికి అంకితమని, మరణానంతర జీవితం కోసంచేసే దానం అని అన్నారు. ఇతర మతాల మాదిరిగా కాకుండా, వక్ఫ్ అనేది దేవునికి చేసే దాతృత్వం అని అభివర్ణించారు.

కపిల్ సిబల్ వాదనపై ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ స్పందించారు. మతపరమైన దానం అనే భావన ఇస్లాంకు మాత్రమే పరిమితం కాదని అన్నారు. హిందూ మతంలో కూడా మోక్షం పేరుతో దానాలను ప్రోత్సహిస్తారని గుర్తు చేశారు. అలాగే దాతృత్యం అనేది అన్ని మతాల ప్రాథమిక భావన అని స్పష్టం చేశారు. కాగా, వివాదాస్పద వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న విజ్ఞప్తిపై ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.