
మహాకుంభ్ను వీఐపీ స్నానాలతో పోలుస్తూ ప్రతిపక్షాలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటికే 45 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు తెలిపారు.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటికే 45 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అయితే ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు. మహాకుంభ్ను వీఐపీ స్నానాలతో పోలుస్తూ ప్రతిపక్షాలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మత సామరస్యం, విశ్వాసాలను పాటిస్తూ.. కోట్ల సంఖ్యలో భక్తులు.. కులం, మతం, భాష, ప్రాంతం వివక్ష లేకుండా స్నానాలు చేస్తున్నట్లు చెప్పారు. పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ 57వ వర్థంతి సందర్భంగా లక్నోలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
నెగటివ్ ప్రచారం చేస్తున్న వాళ్లే.. ప్రభుత్వం నుంచి వీవీఐపీ ట్రీట్మెంట్ తీసుకున్నారని, వాళ్లు తమ భవిష్యత్తు తరాలకు కూడా ఆ వెసలుబాటు కల్పించేలా చేశారని సీఎం యోగి ఆరోపించారు. నెగటివ్ అభిప్రాయాలను క్రియేట్ చేసి భారత్తో పాటు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. జనవరి 29వ తేదీన ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగిన ఘటనలో 30 మంది భక్తులు చనిపోయారు. ఆ ఘటన తర్వాత యూపీ సర్కారుపై విమర్శలు పెరిగాయి. వీఐపీ సంస్కృతికి యూపీ సర్కారు పెద్ద పీట వేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
29 రోజుల్లోనే త్రివేణి సంగమంలో సుమారు 45 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు సీఎం ఆదిత్యనాథ్ తెలిపారు. ఇది చరిత్రాత్మకమైన విషయం అన్నారు. ఓ నగరంలో పుణ్య స్నానాలు చేసేందుకు 45 కోట్ల మంది రావడం కన్నా పెద్ద విషయం ఏమి ఉంటుందని ఆయన అన్నారు. పుణ్య స్నానాలను వీఐపీ స్నానాలుగా పోలుస్తూ కొందరు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు.





