
వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో హిందువుల ఆధ్యాత్మిక మహా శోభాయాత్ర వైభవంగా సాగింది. అయోధ్యలో బాల శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఏడాది గడిచిన సందర్భంగా తొలి వార్షికోత్సవాన్ని ఈ యాత్ర నిర్వహణ ద్వారా నిర్వహించుకున్నారు. అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయం కేంద్రంగా దీని పూర్వాంగ కార్యక్రమాలు సాగాయి. ఉదయం 10 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది.ఈ సందర్భంంగా పూలతో అలంకరించిన రథంపై శ్రీరాముని భారీ విగ్రహాన్ని కొలువుదీర్చారు. వేద పండితులు మంత్రోచ్ఛాటనలు చేస్తూ ప్రజలకు కల్యాణ హారతులు ఇస్తుండగా, భక్తులు తన్మయత్వంతో కార్యక్రమాలను తిలకించారు.
రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్-ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్-వీహెచ్పీ తదితర ధార్మిక సంఘాలతోపాటు పలు దేవాలయాల నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు, భజన బృందాలు, అర్చక సంస్థలు, హిందూ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. కళాకారుల కోలాటం మధ్య శోభాయాత్ర సాగింది. ఉత్సవంలో జై శ్రీరామ్ నామస్మరణలు మార్మోగాయి. జిల్లా నలుమూలల నుంచి ప్రత్యేక వాహనాల్లో భక్తులు ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా విచ్చేశారు. అయోధ్య ఐక్యవేదిక స్థానిక ప్రతినిధి, కార్యక్రమ నిర్వాహకులు దేసు వెంకటరెడ్డి యాత్ర ముగిసేవరకు తన బృందంతో ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పోలీసులు, అధికారులు, సిబ్బంది సహకారంతో యాత్ర సజావుగా కొనసాగింది.





