
భారతదేశం భిన్న సంస్కృతులకు నాగరికతలకు నిలయం. అ లాంటి సంస్కృతులు, జీవన విధానాన్ని పరస్పరం గౌరవించుకోవడం ద్వారా జాతీయ సమైక్యతకు విలువ ఇచ్చినట్లు అవుతుందని మైసూర్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ ఎంకే లోకనాథ్ అన్నారు. మైసూర్ విశ్వవిద్యాలయం జాతీయ సమీకృత శిబిరాలను ప్రతి ఏటా నిర్వహించడంలో భాగంగా జనవరి 22 వరకు ఏడు రోజులు నిర్వహించనున్న శిబిరాన్ని ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ఎన్ఎస్ఎస్ వలంటీర్ను ఉద్దేశించి వీసీ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ ప్రత్యేకత అన్నారు. ఒక రాష్ట్ర సంస్కృతిని మరొక రాష్ట్రానికి పరిచయం చేయడం వారి జీవన విధానాన్ని సంస్కృతిని తెలుసుకోవడం ఎంతో అవసరమన్నారు. జాతీయ శిబిరాలలో పాల్గొనడం వల్ల సమాజం పట్ల గౌరవం, బాధ్యత పెరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు కీలక భూమిక పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ జిల్లాకు చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంబీ సురేష్, మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి.వి కృష్ణారెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన.వెంకటరామిరెడ్డికి నేతృత్వం వహించారు.వైవీయూ సమన్వయకర్త డాక్టర్ ఎన్వీ రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.





