ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయ రత్నభండార్ ను ఇవాళ మళ్లీ తెరిచారు. రెండోసారి టెక్నికల్ సర్వే నిర్వహిస్తున్నారు. పురావాస్తు శాఖ ఆధ్వర్యంలో రత్నభండార్ను ఓపెన్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు వరకు.. ఆలయంలో దర్శనాలు నిలిపివేసినట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిష్ట్రేషన్ పేర్కొన్నది. మూడు రోజలు పాటు రత్నభండార్లో ఉన్న సంపద కోసం అన్వేషించనున్నారు. సర్వే సమయంలో ఆలయ ప్రధాన గేట్లను మూసివేయనున్నట్లు ఎస్జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాండే తెలిపారు. భక్తులు సహకరించాలని ఆయన తన విజ్ఞాపనలో కోరారు.
రత్నభండార్ ఇన్వెంటరీ కమిటీ చైర్మెన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కూడా సర్వేలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్వే జరుగుతుందని, ఒకవేళ రత్నభండార్లో ఏదైనా రహస్య చాంబర్ కానీ, టన్నెల్ కానీ ఉందో అన్న కోణంలో సర్వే జరగనున్నట్లు చెప్పారు. దీని కోసం అత్యాధునిక రేడార్ను కూడా తీసుకువచ్చారు. సెప్టెంబర్ 18వ తేదీన తొలి సర్వే జరిగింది. దాంట్లో 17 మంది సభ్యులు ఉన్న ఏఎస్ఐ బృందం.. ప్రాథమిక ఇన్స్పెక్షన్ చేపట్టింది. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్, ఎన్జీఆర్ఐలకు చెందిన నిపుణులు ఆ బృందంలో ఉన్నారు.