Gallery

త్రిపుల్‌ తలాక్‌ ప్రమాదకరం

5views

ఇస్లాం మతంలోని త్రిపుల్‌ తలాక్‌ ఆచారం ముస్లిం మహిళల పరిస్థితిని దయనీయంగా మార్చిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. త్రిపుల్‌ తలాక్‌ ఆచారం వివాహమనే సామాజిక సంప్రదాయానికి ప్రమాదకరంగా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వివరించింది.
తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే 2019 చట్టాన్ని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వివాహిత ముస్లిం మహిళల లింగ న్యాయం, లింగ సమానత్వం వంటి రాజ్యాంగ లక్ష్యాలను నిర్ధారించడంలో 2019 చట్టం సహాయపడుతుందని, వివక్ష లేకపోవడం, సాధికారికత వంటి వారి ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో సహాయపడుతుందని పేర్కొంది.
సుప్రీంకోర్టు 2017లో ఈ ఆచారాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొందని, అయినా కొంతమంది ముస్లింలలో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతోందని అఫిడవిట్‌ ద్వారా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అందువల్ల ముస్లింలలో త్రిపుల్ తలాక్‌ విడాకుల సంఖ్యను తగ్గించడంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రతిబంధకంగా పనిచేయలేదని తెలిపింది.

త్రిపుల్‌ తలాక్‌ బాధితులు పోలీసులను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకపోవడం, చట్టంలో శిక్షార్హమైన నిబంధనలు లేకపోవడంతో బాధితుల భర్తలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని, దాంతో పోలీసులు నిస్సహాయంగా మారారని పేర్కొంది. త్రిపుల్‌ తలాక్‌ విడాకులను నిరోధించేందుకు కఠినమైన నిబంధనల అవసరం ఉందని వాదించింది.

“తలాక్-ఎ-బిద్దత్ ఆచారాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టినప్పటికీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు హామీ ఇచ్చినప్పటికీ, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తలాక్-ఎ-బిద్దత్ ద్వారా విడాకులు తీసుకున్నట్లు నివేదికలు వచ్చాయి. ఆ ధోరణి కనిపించింది. కొంతమంది ముస్లింలలో ఈ పద్ధతి ద్వారా విడాకుల సంఖ్యను తగ్గించడంలో సుప్రీంకోర్టు తలాక్-ఎ-బిద్దత్ తగిన నిరోధకంగా పని చేయలేదు,” అని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం 30 జూలై 2019న ట్రిపుల్ తలాక్ ఆచారం చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. 1 ఆగస్టు 2019 నుండి శిక్షార్హమైన చట్టంగా ప్రకటించింది. భారత రాజ్యాంగం ప్రకారం తలాక్-ఎ-బిద్దత్ ప్రకటన చట్టపరమైన ప్రభావం, పర్యవసానంగా లేదని కేంద్రం తెలిపింది. కాగా త్రిపుల్‌ తలాక్‌ విధానం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయలేదని, కాబట్టి త్రిపుల్‌ తలాక్‌ విడాకులను నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దాంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.