News

వీడియోకాల్‌లో పెళ్లి.. భారత్‌లోకి చొరబడ్డ పాక్ మహిళ.. మొదటి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి

55views

రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ పాక్‌.. నస్రుల్లా అనే పాకిస్థాన్ యువకుడితో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుంది. నస్రుల్లాను కలిసేందుకు పాక్‌కు వెళ్లిన ఆమె, అతడ్ని పెళ్లి చేసుకుంది. అనంతరం నస్రుల్లాను అంజూ తిరిగి పాకిస్థాన్‌లోకి పంపించింది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన మరువక ముందే.. ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో.. 25 ఏళ్ల పాకిస్తానీ యువతి గత వారం భారత్, పాక్ సరిహద్దుదాటి రాజస్థాన్‌కు చెందిన ప్రియుడి ఇంటికి చేరింది.

అతడితో ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి, తరువాత వారిద్దరూ వీడియోకాల్‌లో వివాహం(నికాహ్) చేసుకున్నారు. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాయాది పాకిస్తాన్ లాహోర్‌కి చెందిన మెహ్విష్(33) అనే మహిళతో రాజస్థాన్ రాష్ట్రం చురులోని ప్తిసర్‌కి చెందిన రెహ్మాన్‌(35) వీడియో కాల్‌లో పెళ్లి చేసుకున్నారు.

అనంతరం వీరిద్దరు మరోసారి సౌదీ అరేబియాలో లైవ్‌గా వివాహం చేసుకున్నారు. మెహ్విష్ జులై 27న భారత్, పాక్ సరిహద్దు దాటి చురుకి వచ్చింది. రెహ్మాన్ ప్రస్తుతం కువైట్‌లో ఉన్నాడు. అయితే మెహ్విష్ భర్త కుటుంబంతో గడిపేందుకు ఇండియాకు వచ్చింది. రెహ్మాన్ మొదటి భార్య ఫరీదా బానోకు.. మెహ్విష్ విషయం తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త వ్యాపారం చేసేందుకు తన నగలను కూడా ఇచ్చానని.. నగలు తీసుకున్నాక అతను తనను, తన పిల్లల్ని పట్టించుకోవడం లేదని మొదటి భార్య ఆరోపించింది.

స్నేహం ప్రేమగా…

రెహ్మాన్, మెహ్విష్‌లు ఫేస్‌బుక్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. అయితే వీరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. మెహ్విష్‌కి కూడా ఇది రెండో వివాహమే. వీరిద్దరికి వేర్వేరుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2006లో వివాహం చేసుకున్న మెహ్విష్‌కి మొదటి వివాహం ద్వారా ఇద్దరు కుమారులు ఉండగా… కొన్ని ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. అలా ప్రేమలో పడిన వీరిద్దరు వీడియో కాల్‌లో పెళ్లి చేసుకున్నారు.

దీనిపై సదరు వ్యక్తి మొదటి భార్య కేసు నమోదు చేసింది. వరకట్నం కోసం వేధించడంతో పాటు తనకు ట్రిపుల్ తలాక్ చెప్పిన కారణంగా ఆమె, తన భర్తపై ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా సదరు పాకిస్తానీ మహిళ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులకు వెల్లడించింది. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఈ కేసులో మొదటి భార్య ఫరీదా బానో ఫిర్యాదు మేరకు భర్త రెహ్మాన్ ఖాన్, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదైంది. పోలీసులు ఈ కేసును మరికొన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నారు.