News

చందమామపై గుహ!

204views

చందమామపైకి మానవసహిత యాత్రలు తిరిగి ప్రారంభించాలని, అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న శాస్త్రవేత్తలకు ఇదో శుభవార్త. జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తాజాగా తేలింది. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు.

తాము గుర్తించిన గుహ ఒకింత పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశమార్గం ఉన్నట్లు చెప్పారు. 1969లో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్, ఆల్డ్రిన్‌లు దిగిన ‘సీ ఆఫ్‌ ట్రాంక్విలిటీ’ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఒక లావా సొరంగం కుప్పకూలడం వల్ల అది ఏర్పడినట్లు పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ప్రయోగించిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌వో) అందించిన రాడార్‌ కొలతలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. ఆ వివరాలను భూమి మీదున్న లావా సొరంగాలతో పోల్చి చూశారు. నేలమాళిగలోని ఒక గుహకు సంబంధించిన కొంత సమాచారాన్ని ఈ రాడార్‌ డేటా వెల్లడి చేస్తోంది. ఆ ఆకృతి వెడల్పు 130 అడుగులు, పొడవు పదుల మీటర్లలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాలు వ్యోమగాములకు సహజసిద్ధ షెల్టర్లుగా అక్కరకొస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్‌ కిరణాలు, సౌర రేడియోధార్మికత, చిన్నపాటి ఉల్కల నుంచి ఇవి రక్షిస్తాయని తెలిపారు. చందమామపై పునాదుల స్థాయి నుంచి ఆవాసాన్ని నిర్మించడానికి చాలా సమయం పడుతుందని, పైగా అది సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని వివరించారు. అక్కడి గుహల్లోని శిలలు, ఇతర పదార్థాలు.. లక్షల ఏళ్లుగా వెలుపలి కఠిన వాతావరణ పరిస్థితులకు గురై ఉండవని తెలిపారు. అందువల్ల వాటిని పరిశోధించడం ద్వారా చంద్రుడి ఆవిర్భావం గురించి లోతైన వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా అక్కడి అగ్నిపర్వతాల చర్యపై అవగాహన పెంచుకోవచ్చన్నారు.