News

దైవారాధనే మోక్షానికి మార్గం

63views

దైవాన్ని ఆరాధించడం ద్వారానే మోక్షానికి మార్గం లభిస్తుందని ఇస్కాన్ జీబీసీ చైర్మన రేవతి రమణ ప్రభు పేర్కొన్నారు. జగన్నాథ రథోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కేంద్రంలోని లలితకళా పరిషతలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 జంటలచే సామూహికంగా కలశ పూజలు నిర్వహించి, స్వామివార్లకు భక్తుల చేతులమీదుగా కలశాభిషేకం చేయించారు. అనంతరం నిర్వహించిన స్వామివారి దర్బార్‌లో రేవతి రమణ ప్రభు చేతులమీదుగా స్వామివార్లకు దశహారతులు సమర్పించారు.

భక్తులనుద్దేశించి రేవతి రమణ ప్రభు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. జగన్నాథుడి దర్శనం జన్మజన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. నేటి బిజీ ప్రపంచంలో మనం ఎంత బిజీగా ఉన్నా దైవారాధనకు ఎంతో కొంత సమయం ఖచ్చితంగా వెచ్చించాలని, అపుడే మన జీవితానికి సార్థకత ఉంటుందన్నారు. మహామంగళహారతి నివేదనానంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం, అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఇస్కాన మందిర చైర్మన దామోదర్‌ గౌరంగదాస్‌, రాధా మనోహర్‌దాస్‌, శ్రీపాద వేణు, ఎల్‌కేపీ ప్రధాన కార్యదర్శి పద్మజ, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.