News

‘నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అనే నేను’.. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం

79views

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో ప్రమాణం చేయించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా ఎన్డీఏ మిత్రపక్షాలు హాజరయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుక జరిగింది. మోదీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

ప్రధానిగా నరేంద్ర మోదీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో నేతగా మోదీ నిలిచారు. మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ తర్వాత కేంద్ర మంత్రులుగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ. నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్, మనోహర్ కట్టర్, కుమారస్వామి, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రాం మాంఝీ ప్రమాణం చేశారు. మోదీతో పాటు మొత్తం 68 మంది ప్రమాణం చేశారు.