ArticlesNews

జ్యేష్ఠం – ఎంతో శ్రేష్ఠం

70views

జ్యేష్ఠ మాసాన్ని ఎన్నో గొప్ప పర్వదినాలు గల పావన మాసంగా భావిస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడే మాసం జ్యేష్టం. ఈ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ మాసంలోని ఎన్నో తిథుల్లో పర్వదినాలు వస్తున్నాయి. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమినాడు మహిళలు సౌభాగ్యం కోసం కరవీర వ్రతం చేస్తారు. అంటే గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తారు. విదియనాడు శ్రాద్ధకర్మలు ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఈ తిథిని ‘సోప పదం’ అనీ పిలుస్తారు.

పార్వతీదేవి ఉమాదేవిగా అవతరించిన రోజు శుద్ధ చవితి. ఉమాదేవిని ఈ రోజున ఆరాధిస్తారని బ్రహ్మపురాణ కథనం. శుద్ధ షష్ఠినాడు అరణ్యక గౌరీవ్రతం, వింధ్యవాసినీ వ్రతం ఆచరిస్తారని స్కాందపురాణం చెబుతోంది.శుద్ధ అష్టమినాడు శుక్లాదేవి రూపంలో అవతరించిన అమ్మవారిని ఆరాధిస్తారు. నవమినాడు ఉపవాసం చేసి బ్రాహ్మణీదేవిని అర్చిస్తారు. శుద్ధ ఏకాదశిని ‘నిర్జలైకాదశి’ అని పిలుస్తారు. ఆ రోజున మంచినీళ్లు అయినా తాగకుండా ఉపవసిస్తారు.శుద్ధ ద్వాదశినాడు త్రివిక్రమ మూర్తిని ఆరాధిస్తారు. శుద్ధ త్రయోదశినాడు విద్యారణ్య స్వామివారి జయంతి జరుపుతారు.

జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ పర్వదినాన్ని ఏరువాక పున్నమిగా వ్యవహరిస్తారు. రైతులకు ఎంతో ప్రాధాన్యాన్నిచ్చే పండగ. కర్షకులు, కార్మికులు ఈ రోజున వ్యవసాయ పరికరాలను, వృషభాలను అలంకరించి పూజిస్తారు. కృష్ణ యజుర్వేదంలో ఈ పర్వదిన వివరణం విస్తృతంగా కనిపిస్తుంది. బహుళ ద్వాదశి ‘కూర్మజయంతి’గా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించాడు. కూర్మ ఆరాధన సర్వశుభాలను ప్రసాదిస్తుంది. సౌభాగ్యప్రదమైన జ్యేష్ఠమాసంలో ఉన్నన్ని పర్వదినాలు ఏ మాసంలోనూ లేవు. అందుకే జ్యేష్టం అత్యంత శ్రేష్ఠం అన్నారు.