కోర్టు ఆదేశాలను చూపిస్తూ తమిళనాడు ప్రభుత్వం రెండు ఆలయాలను కూల్చేసింది. శ్రీధర్మశాస్త్ర ఆలయంతో పాటు గాంధీ రోడ్డులో వున్న వినయగర్ ఆలయాన్ని కూడా కూల్చేశారు.దీంతో హిందూ భక్తులు, ఇతరులు వర్షంలో తడుస్తూనే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాలువ వెంబడి ఆనుకొని వున్న భవనాలు, దేవాలయాలు సహా మొత్తం 36 ఆక్రమణలను తొలగించాలని మద్రాసు హైకోర్టు గతంలో ఆదేశించింది. హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమోంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా వినాయనగర్ టెంపుల్ నిర్వహించబడుతోంది. ఇది కాలువకు ఆనుకొనే వుంది. హైకోర్టు ఆదేశాలతో నీటిపారుదల, పబ్లిక్ వర్క్స్ శాఖతో పాటు రెవిన్యూ శాఖలు అక్కడికి చేరుకున్నాయి. కూల్చివేతలను ప్రారంభించాయి. దీంతో భక్తులు తమ నిరసనను వ్యక్తం చేశారు. హిందూ భక్తులతో పాటు హిందూ మున్నాని పార్టీ, బీజేపీ, ఇతర హిందూ సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. అయినా సరే… కూల్చివేతలు చేస్తూనే పోయాయి.
తమకు కొంత సమయం కావాలని, జిల్లా కలెక్టర్తో తాము మాట్లాడతామని ఆలయ నిర్వాహకులు కూల్చివేతకు వచ్చిన అధికారులను కోరినా.. వారు వినలేదు. అయితే.. దేవతా విగ్రహాలను, ఇతర సామాగ్రిని జాగ్రత్తగా ఇతర ఆలయాలకు అధికారులు తరలించారు. కోర్టు ఆదేశాల ముసుగులో అక్కడి ప్రభుత్వం హిందూ శ్రద్ధా కేంద్రాలను టార్గెట్ చేసిందని పలువురు మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణాలంటూ తమిళనాడు ప్రభుత్వం హిందూ దేవాలయాలను కూల్చేస్తోందని, మరి మిగతా అక్రమ భవంతుల విషయం ఏమిటంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దేవాలయాల కూల్చివేత కచ్చితంగా హిందూ ధర్మంపై దాడిగానే తాము చూస్తామని భక్తులు తేల్చి చెబుతున్నారు. కేవలం హిందూ దేవాలయాలనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజలు మండిపడుతున్నారు.