ArticlesNews

పేరుకే టీటీడీ అనుబంధ ఆలయాలు

88views

అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం శ్రీపట్టాభి రామాలయం, తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కోసూరివారిపల్లె శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయాలను రెండు దశాబ్దాల క్రితమే టీటీడీ స్వాధీనం చేసుకుని ఈ ఆలయాల ఆలనాపాలన నిర్వహిస్తోంది. ఈ ఆలయాలకు ఉన్న ఎంతో ప్రాచీన చరిత్రను పరిగణలోకి తీసుకున్న టీటీడీ ఈ మూడు ఆలయాలను స్వాధీనం చేసుకుని నిత్య కైంకర్యాలు నిర్వహిస్తోంది. అయితే తిరుమల, తిరుపతిలోని ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాల్లో సైతం టీటీడీ స్వామి వారి లడ్డు ప్రసాదాలను భక్తులకు అందుబాటులో పెట్టాల్సి ఉన్నా, ఇందుకు తగిన చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని ఈ మూడు ఆలయాల్లో కేవలం ఏడాదిలో వచ్చే వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఒక్క రోజు మాత్రమే (కల్యాణోత్సవం రోజు మాత్రమే) స్వామివారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు తితిదే అందుబాటులో తీసుకొస్తుంది.

ఆ ఒక్కరోజు టీటీడీ ప్రసాదాల స్టాకు ఒక్క రోజులోనే భక్తులు కొనుగోలు చేసేస్తున్నారు. ఏడాదంతా ఈ ఆలయాల్లో లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాల్లో కొన్ని విశేష దినాలతో పాటు, పండగలలో స్థానిక ఆలయాల్లో తిరుమల లడ్డును అందుబాటులోకి తెస్తే నిరుపేదలతో పాటు స్థానిక పజలు లడ్డును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇప్పటికైనా స్థానిక ఆలయాల్లో కనీసం విశేష పర్వదినాల్లోనైనా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని టీటీడీ స్థానిక ఆలయాల నిర్వహణాధికారి కృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లగా విశేష దినాల్లో తిరుమల లడ్డు ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విషయం టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Source : ఈనాడు