విశ్వ హిందూ పరిషత్- వీహెచ్పీలో శిక్షణ పొందిన కార్యకర్తలు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని వీహెచ్పీ క్షేత్ర సంఘటన మహా మంత్రి గుమ్మళ్ల సత్యం పిలుపునిచ్చారు.కర్నూలు నగర శివారులో గుత్తి రోడ్డులోని రిడ్జ్ పాఠశాల్లో గత తొమ్మిది రోజులుగా కొనసాగిన ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, తెలంగాణ ప్రాంతాల విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల శిక్షణ శిబిరం ముగిసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన గుమ్మళ్ల సత్యం మాట్లాడుతూ వీహెచ్పీ కార్యకర్తలు పది రోజుల శిక్షణ శిబిరంలో నేర్చుకున్న అంశాలను భవిష్యత్తులో ఆచరిస్తూ సమాజానికి, దేశానికి ఉపయోగపడే దిశగా ముందుకు పోవాలని కోరారు.
విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ శిక్షణ పొందిన కార్యకర్తలు విశ్వహిందూ పరిషత్ వ్యాప్తితోపాటు సామాజికంగా, ధార్మికంగా, హిందూ ధర్మ పరిరక్షణ దిశగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ, క్షేత్ర గోరక్షా ప్రముఖ్ యాదగిరి రావు, ప్రాంత సంఘ టనా మంత్రి శ్రీనివాసరెడ్డి, కేంద్ర వీహెచ్పీ ట్రస్టు సభ్యులు రామారావు, తెలంగాణ రాష్ట్ర వీహెచ్పీ అధ్యక్షుడు నరసింహమూర్తి, ప్రాంత సహ కార్యదర్శి రాజేశ్వరరెడ్డి, దక్షిణాంధ్ర కో కన్వీనర్ గురుమూర్తి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి, వీహెచ్పీ జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాశ్ పాల్గొన్నారు.