News

24నుంచి విశాఖలో భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహా సభలు

169views

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు. షీలానగర్‌లోని బీవీకే స్కూల్ ప్రాంగణంలో రెండురోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. ఈ సభలకు బీఎంఎస్ అఖిల భారత అధ్యక్షులు హిరణ్మయ పాండ్యా, దక్షిణమధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి దొరైరాజు, బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మళ్ళ జగదీశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆశామోల్ తదితరులు హాజరవుతారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి సంఘటిత, అసంఘటిత రంగాలలోని కార్మికులు సుమారు 5వందల మంది ఈ మహాసభల్లో పాల్గొంటారని మళ్ళ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేసారు. బీఎంఎస్ రాష్ట్ర మహాసభలను విశాఖపట్నంలో నిర్వహించే అవకాశం రెండు దశాబ్దాల తర్వాత వచ్చిందని ఆయన వెల్లడించారు. వివిధ రంగాలకు చెందిన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చిస్తామని, వాటి పరిష్కారానికి తీర్మానాలు చేసి ఆమోదిస్తామని, ఆ తీర్మానాలను ప్రభుత్వానికి తెలియజేస్తామనీ ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత బీఎంఎస్ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం ఇది నాలుగోసారి. ఈ సమావేశాలను విజయవంతం చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె లోవరెడ్డి, విశాఖపట్నం జిల్లా బీఎంఎస్ అధ్యక్షులు సురేష్ కుమార్, కార్యదర్శి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మోటూరు వెంకట సన్యాసి నాయుడు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.