
అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న శ్రీరాముని ఆలయం నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్ధం రామస్వామి వారి దేవస్థానానికి బుధవారం అక్షింతలు చేరాయి. విజయనగరం జిల్లా సమరసత సేవా సంస్థ ప్రతినిధులు ఈ అక్షింతల కలశాన్ని దేవాలయానికి తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు ఆహ్వానించి తొలుత చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం అక్షింతలను స్వామి వారి సన్నిధిలో ఉంచి అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల 22న అయోధ్యలో జరగఔనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ వరకు శ్రీరామ జయరామ జయజయ రామ అనే తారక మంత్రాన్ని జపిస్తూ అక్షింతలను రోజుకు 108 సార్లు ఆ పాత్రలో వేయాలని అర్చకులు సూచించారు.
అయోధ్య అక్షింతలు పంపిణీ
జిల్లాలోని సంతకవిటి మండలం కొండగూడెం గ్రామంలో అయోధ్య రామ మందిరం అక్షింతలను గ్రామ పెద్దల సమక్షంలో బుధవారం పంపిణీ చేశారు. రామ మందిరం ఫొటోలను కూడా ప్రతి ఇంటికీ వెళ్లి అందించారు. స్థానిక వస్త్రపురి కాలనీలో బుధవారం శ్రీ ఆంజనేయ స్వామి యువజన సంఘం ఆధ్వర్యంలో అయోధ్య అక్షింతలు, ఫొటోలను పంపిణీ చేశారు. కాలనీ వాసులు కోలాటం. పండర భజన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.





