
ముంబైలో మాజ్గాన్ డాక్యార్డులో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నేవీకి చెందిన నిర్మాణంలో ఉన్న యుద్ధనౌకలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి మృతి చెందాడు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడి చికిత్సకోసం ముంబై జేజే హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
‘విశాఖపట్నం’ అనే ఈ యుద్ధనౌక నిర్మాణంలో ఉంది. సాయంత్రం 5గంటల 45 నిమిషాలకు మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. నౌకలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మొత్తం 8 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది అగ్నిమాపక సిబ్బంది. ఇక రెండో అంతస్తులో చెలరేగిన మంటలు చిన్నగా మూడో అంతస్తుకు వ్యాపించినట్లు ఫైర్ సిబ్బంది పేర్కొంది. ఈలోగా దట్టమైన పొగ నౌకను కమ్మేసినట్లు తెలిపారు. మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అయితే మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై విచారణ తర్వాతే వెల్లడిస్తామని చెప్పారు. భారత్లో జలాంతర్గాముల నిర్మాణం ఒక్క ముంబైలోని మాగజాన్ డాక్యార్డులోనే జరుగుతుంది. విశాఖపట్నం అనే ఈ యుద్ధనౌక నిర్మాణం చేపట్టేందుకు ఏప్రిల్ 2015లో ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రాజెక్టు 15-బి కింద ఈ యుద్ధ నౌకను నిర్మిస్తున్నారు. ఈ యుద్ధ నౌకలో ఉండే క్షిపణ వ్యవస్థ అత్యాధునికమైందని అధికారులు తెలిపారు.





