News

బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిన మిగ్‌జాం తుపాను

352views

తీవ్ర తుపాను మిగ్‌జాం బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరో గంట వ్యవధిలో పూర్తిగా తీరాన్ని దాటనుందని వెల్లడించారు. ‘మిగ్‌జాం’ తీరం దాటిన తర్వాత సాయంత్రానికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముంది. తుపాను తీరం దాటుతున్న నేపథ్యంలో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. సముద్రంలో అలలు సుమారు 2మీటర్ల మేర ఎగసిపడుతున్నాయి.

తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.