News

అయోధ్యలో ప్రతిష్టించనున్న ధ్వజ స్థంభాలు

308views

దేశ ప్రధాని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదు. 2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజు. నాడు జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం, రాముని విగ్రహ ప్రతిష్ణాపన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రామమందిరం కోసం ఏడు ధ్వజ స్తంభాల నిర్మాణం జరుగుతోంది. వీటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.

అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్‌లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీకి అప్పగించారు. ఈ ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. కంపెనీ ఎండీ భరత్ మేవాడ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలోని నూతన రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల తయారీ పని తమకు అప్పగించారని, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు.

వీటిలో 5,500 కిలోల బరువున్న ఒక ప్రధాన ధ్వజ స్తంభంతో సహా ఏడు ఇతర ధ్వజ స్తంభాలు ఉన్నాయని భరత్‌ తెలిపారు. మరోవైపు రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. ఆలయ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్‌రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్‌లో మార్బుల్‌ను అమర్చారు. అలాగే ఆలయ నృత్య మండపంతోపాటు రంగ మండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది.