రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వస్థలమైన ఒడిశాలోని రాయ్రంగాపుర్- బాదంపహార్ మార్గంలో తొలిసారిగా ప్యాసింజర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మయూర్భంజ్ జిల్లాకు నూతనంగా మూడు రైళ్లను కేటాయిస్తూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంత వాసుల చిరకాల కోరిక తీరనుంది. రాష్ట్రపతి జన్మస్థలం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా రాయ్రంగాపుర్ ప్రాంతం. ఈ ప్రాంతం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వస్తుంది. గిరిజన తెగలు ఎక్కువగా నివసించే రాయ్రంగాపుర్ ప్రాంత వాసులు చాలా కాలంగా ప్యాసింజర్ రైలు సేవలు కోసం ఎదురు చూస్తున్నారు. వారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మయూర్భంజ్ జిల్లాకు మూడు రైళ్లను కేటాయిస్తు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కోల్కతా(షాలిమర్)- బాదంపహార్ వీక్లీ ఎక్స్ప్రెస్, బాదంపహార్-రుర్కెలా-టాటానగర్ ఎక్స్ప్రెస్, రుర్కెలా-టాటానగర్ ఎక్స్ప్రెస్( వారంలో ఆరు రోజులు) ఈ రైళ్లు తిరగనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
“టాటానగర్ నుంచి-బాదంపహార్ మార్గంలో మెయిల్/ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటులో రానుండటం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వస్థలం మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగాపుర్ ప్రాంతంతో పాటు బాదంపహార్ ప్రాంతవాసులకు రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ ప్రాంతంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇక్కడి ప్రజల డిమాండ్ను పరిష్కరించాం. దీని ద్వారా స్థానికంగా ఉన్న ప్రజలు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారు. గిరిజన తెగలకు చెందిన ఈ ప్రాంతం మరింత ప్రగతి సాధించేందుకు ఉపయోగపడుతుంది. త్వరలోనే రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తాం.”అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు
నూతన రైళ్ల సమయాలివే……
షాలిమార్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి శనివారం రాత్రి 11-05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5-40 గంటలకు బాదంపహార్ చేరుకుంటుంది. తిరిగి బాదంపహార్లో రాత్రి 9.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది.





