News

వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం : భారత వాయుసేన

297views

వచ్చే ఏడు, ఎనిమిదేళ్లలో రూ.2.5-3లక్షల కోట్ల విలువైన సైనిక వ్యవస్థలు, హార్డవేర్‌లు, ఇతర పరికరాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు భారత వాయుసేన వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి.. ముఖ్యంగా తూర్పు లద్ధాఖ్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. అక్టోబర్‌ 8న ఎయిర్‌ఫోర్స్‌ డే పురస్కరించుకొని తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరీ పలు వివరాలు వెల్లడించారు.

‘రష్యా నుంచి ఇప్పటివరకు మూడు యూనిట్ల ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను అందుకున్నాం. మిగతా రెండు వచ్చేఏడాది నాటికి అందుతాయని ఆశిస్తున్నాం. అదనంగా 97 తేజస్‌ మార్క్‌ 1ఏ తేలికపాటి యుద్ధ విమానాలను సేకరించేందుకు వాయుసేన ప్రయత్నాలు జరుపుతోంది. తూర్పు లద్ధాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నాం. మా కార్యాచరణ ప్రణాళికలు డైనమిక్‌గా ఉంటాయి’ అని ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరీ స్పష్టం చేశారు.

భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొంటున్న వేళ బలమైన సైనిక శక్తి అవసరమని వీఆర్‌ చౌధరీ పేర్కొన్నారు. ఈ క్రమంలో సైన్యానికి వాయుసేన తోడుగా నిలుస్తుందన్నారు. అగ్నిపథ్‌ పథకాన్ని విజయవంతం చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోమన్నారు. ఇక యుద్ధం, విపత్కర సమయాల్లో త్రివిధ దళాలు కలిసి పనిచేసే ‘థియేటరైజేషన్‌ ప్రాజెక్టు’కు సంబంధించిన ప్రణాళికలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వాయుసేన చీఫ్‌ పేర్కొన్నారు.