
269views
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు(మహిళా రిజర్వేషన్ బిల్లు) లోక్సభలో మెజార్టీతో ఆమోదం పొందింది.
నూతన పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి. లోక్సభలోని 545 మంది ఎంపీలకు గానూ 456 మంది సభకు హాజరై ఓటు వేశారు. అంతకు ముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేయగా.. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్ను ప్రారంభించారు. ఓటేసిన 456 మంది లోక్సభ సభ్యులలో 454 మంది మద్దతుగా ఓటు వేయగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఆ ఇద్దరు ఎంపీలు ఎంఐఎం పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు ఔరంగాబాద్/ఛత్రపతి శంభాజీనగర్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకంగా ఓటు వేశారు.





