
తెలంగాణలోని హైదరాబాద్ లో ఉగ్రవాదుల జాడ కలకలం సృష్టిస్తోంది. నగరంలోని మైలార్ దేవ్ పల్లి ప్రాంతంలో ఉన్న శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఈ రోజు భారీగా సోదాలు నిర్వహించారు. అబుదాబీ ఐసిస్ మాడ్యుల్ కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ అనుచరులు ఇక్కడ దాగి ఉన్నరన్నపక్కా సమాచారంతో ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈరోజు ఉదయం 8 గంటలకు శాస్త్రిపురంలోని 8 మంది ఐసిస్ సానుభూతిపరులకు సంబంధించిన ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. గతేడాది అరెస్ట్ అయిన అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్కు చెందిన యువకులు ఢిల్లీలో భారీ విధ్వంసాలకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికోసం వారు రసాయనాలను, డబ్బులను సమకూర్చుకుంటున్నారు. గతంలోనే.. ఢిల్లీలోని ఆర్ఎస్సెస్ నాయకుడి హత్యకు కుట్రలు పన్నారని.. ఈమేరకు వారికి ఐసిస్ నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. కాగా, ఈ తనిఖీల్లో ఏం బయటపడింది అన్న విషయమై ఇంకా తెలియాల్సి ఉంది. సోదాలు కొనసాగుతున్నాయి.





