
హరియాణాలోని కైతల్లో దుండగులు కరెన్సీ నోట్లు వెదజల్లి వెళ్లిన ఘటన కలకలం సృష్టించింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ తరుణంలో ఇప్పటికే పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘నాకు కరోనా ఉంది’ అంటూ దుండగులు నోట్లపై రాసి విసరడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఇలాంటి ఘటనే కైతల్లోని కర్ణ్ విహార్లో శనివారం జరిగింది. జింద్ బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న మురికివాడలో కొందరు దుండుగులు రూ.500 నోట్లను వెదజల్లి వెళ్లారు. దీంతో ఆందోళన చెందిన స్థానికులు సిటీ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాదాపు రూ.15 వేలు విలువజేసే కరెన్సీ నోట్లపై రాళ్లు ఉంచారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కరెన్సీ నోట్లను శానిటైజింగ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలనీలోని ఖాళీ స్థలంలో నోట్లను విసిరి వెళ్లారని, కొవిడ్-19 నేపథ్యంలో ప్రజలు నోట్లు తీసుకోవడానికి భయపడ్డారని పోలీసులు తెలిపారు. దుండగుల్ని ఎవరూ చూడలేదని ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు.