
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని యోగా గురు రాందేవ్ శనివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ వ్యాపించకుండా తగిన నివారణ చర్యలు, జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోండి. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, బస్సు, రైలు, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు శానిటైజర్ని వాడండి. అలాగే వేరే వ్యక్తులకు 4 నుంచి 5 అడుగుల దూరంలో ఉండండి. తప్పనిసరిగా మాస్కులను ధరించండి. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ యోగా సాధన చేయండి. ఉబ్బసం, గుండె జబ్బులు, మధుమేహం చికిత్సలు తీసుకునే వారు సహజమైన జీవనశైలిని అనుసరించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వారు తొందరగా కోవిడ్ 19 బారిన పడే అవకాశం ఉంది’ అని చెప్పారు.





