News

అమరవీరుడు సుఖదేవ్ జీవితం నేటికీ యువతకు స్ఫూర్తి

9views

అమరవీరుడు సుఖదేవ్  జీవితం నేటి తరానికి దేశభక్తి, త్యాగం, వ్యక్తిత్వ నిర్మాణానికి ఆదర్శమని పేర్కొన్నారు. దేశ నిర్మాణం వ్యక్తిగత ఆచరణతోనే ప్రారంభమవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ సహ సర్‌కార్యవాహ శ్రీ అరుణ్ కుమార్  స్పష్టం చేశారు.

ఉన్నత విద్య, వ్యక్తిగత ప్రగతి అన్నీ కూడా దేశసేవ దిశగా మలచబడాలని సుఖదేవ్ తన జీవితంతో చూపించారని ఆయన తెలిపారు. “విద్యను కేవలం వ్యక్తిగత అభివృద్ధి కోసం కాకుండా, దేశం కోసం అభ్యసించాలి” అనే భావన సుఖదేవ్ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందన్నారు.

ఈ సందర్భంగా ఆయన సుఖదేవ్ బాల్యానికి సంబంధించిన ఒక సంఘటనను వివరించారు. చిన్నప్పుడొకసారి కుటుంబ సభ్యులు కొంత డబ్బు ఇచ్చి మార్కెట్‌కు పంపగా, ఇతర పిల్లలు మిఠాయిలు, బొమ్మలు కొనుగోలు చేసినప్పటికీ, సుఖదేవ్ మాత్రం రాణి లక్ష్మీబాయి చిత్రాన్ని తీసుకువచ్చారని తెలిపారు.

ఆ చిత్రాన్ని చూపిస్తూ “నేను కూడా రాణి లక్ష్మీబాయిలా దేశం కోసం పోరాడుతాను” అని చిన్న వయస్సులోనే సుఖదేవ్ చెప్పిన మాటలు అతని దేశభక్తిని ప్రతిబింబిస్తాయని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

“రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలంటే, ప్రతి భారతీయుడు ‘దేశం కోసం నేను ఏమి చేయాలి?’ అని తనను తాను ప్రశ్నించుకోవాలి. ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడకుండా, ప్రతి వ్యక్తి తన కుటుంబం, సమాజం, పరిసరాల నుంచే మార్పు ప్రారంభించాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

భారత భవిష్యత్తును నిర్మించగల శక్తి యువతలోనే ఉందని, దేశభక్తి, కర్తవ్యనిష్ఠ, సేవాభావం వంటి విలువలను చిన్ననాటి నుంచే పిల్లల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.