
ప్రకృతిని పూజించే మంచి వాతావరణంలో దైవాన్ని చూసే సనాతన ధర్మంలో మనమంతా పుట్టామని సనాతన ధర్మం, భగవద్గీత ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ అన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ – ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి వేంకటేశ్వర కల్యాణ మండపం వరకు కోలాటం, ధింసా, భజనలతో ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం నిర్వహించిన సభలో రాధా మనోహర్దాస్ మాట్లాడుతూ, పరమతాల్లోకి వెళ్లకుండా జీవించినంత కాలం హిందువుగా, నిజాయితీగా వుండాలని పిలుపునిచ్చారు. మనమంతా భరతమాత కోసం ఈ గడ్డపై జన్మించిన వాళ్లమని, చివరకు వందేమాతరం అంటూ ప్రాణాలు వదిలేయాలని అన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాటం, ప్రాణత్యాగం చేసిన నేలలో ఉన్న మనమంతా నిరంతరం ఆయనను స్మరించుకుంటూ, పౌరుషంతో బతకాలని పిలుపునిచ్చారు. హిందువులంతా నిజాయితీగా ధైర్యంతో వుండాలని, దేశానికి వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలు సాగించే వారికి దీటుగా సమాదానం ఇవ్వాలన్నారు.





