News

హిందూ ఆలయాలకు పంచలోహ విగ్రహాలు

164views

హైందవ సంస్కృతి విస్తరణ, ప్రజల్లో భక్తిభావన పెంపు లక్ష్యంగా హిందూ ఆలయాలకు రాతితో పాటు విలువైన పంచలోహ విగ్రహాలను టిటిడి అందిస్తోంది. సనాతన ధర్మప్రచారంలో భాగంగా మైక్‌సెట్లు, గొడుగులు, శేషవస్త్రాలు, రాతి శిల్పాలు, పంచలోహ విగ్రహాలను రాయితీపై ఇస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది. ్య మైక్‌సెట్‌ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.25 వేలు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీ, ఎస్టీలు 90% రాయితీపోనూ రూ.2,500లకు డీడీ పంపించాల్సి ఉంటుంది. ఇతరులు 50% రాయితీపోనూ రూ.12,500 చెల్లించాలి.

  • గొడుగులు కేటగిరీలతో సంబంధం లేకుండా రూ.14,500 విలువ చేసేవి 50% రాయితీపోనూ రూ.7,250లకు అందిస్తుంది.
  • హిందూ దేవాలయాల అవసరాలకు అనుగుణంగా శేషవస్త్రాలను ఉచితంగా అందజేయనుంది.
  • శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి రాతి విగ్రహాలు 5 అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్నవి ఉచితంగా ఇస్తుంది. మిగిలిన దేవతా విగ్రహాలను 75 శాతం రాయితీపై అందజేస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితం.
  • పంచలోహ విగ్రహాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీలకు 90%, ఇతర వర్గాలకు 75% రాయితీ వర్తిస్తుంది. దేవతామూర్తుల రాతి, పంచలోహ విగ్రహాల పేర్లు, కొలతలతో ఆలయ అభ్యర్థన లేఖ పంపించాలి.
  • విద్యాసంస్థలకు సరస్వతీదేవీ రాతి విగ్రహాలను 50% రాయితీతో అందిస్తోంది. ఎంఈవో లేదా డీఈవో ఆమోదంతో దరఖాస్తు సమర్పించాలి. మఠాలు, ట్రస్టులు, ఆశ్రమాలకు 50% రాయితీతో అందిస్తారు.
  • ఈ కానుకలు కావాల్సిన వారు వ్యక్తిగత దరఖాస్తుతో పాటు ఆలయ కమిటీ దరఖాస్తు పత్రం, స్థానిక తహసీల్దార్, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నుంచి సిఫార్సు లేఖ, ఆలయ ఫొటో, కరెంట్‌ బిల్లు, దరఖాస్తుదారు ఆధార్‌ కార్డు తదితరాలు జత చేయాలి. డీడీ పంపాల్సిన చిరునామా: ‘కార్యనిర్వహణాధికారి, తితిదే పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి’. వివరాలకు 0877-2264276 ఫోన్‌ నంబర్‌పై సంప్రదించవచ్చు.