
శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు విజయనగరం జిల్లా కీర్తిని పెంచేలా నిర్వహించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్టోబరు 6, 7 తేదీల్లో నిర్వహించే ఉత్సవం ఆహ్లాదకర వాతావరణంలో చేసుకోవాలని, గతేడాది కంటే గొప్పగా నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్తో కలిసి పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉత్సవాలకు వారం రోజుల ముందు నుంచే నగరమంతా విద్యుత్ కాంతులతో అలంకరించాలని, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సిరిమాను ఊరేగింపు 3 గంటలకే మొదలు పెట్టాలని, ఐదు గంటలకు ముగించేయాలన్నారు. కలెక్టర్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ మాట్లాడుతూ శాఖల వారీగా ఎవరెవరు ఏఏ పనులు చేయాలో ఆదేశించారు.
సాధారణ దర్శనాలకు ఇబ్బంది కలగకుండా విఐపీ దర్శనాలను ఏర్పాటు చేయాలని దేవాలయ అధికారులకు ఆదేశించారు. కంట్రోల్ రూం, మెడికల్ క్యాంప్, 108 వాహనం కూడా ఏర్పాటు చేయాలన్నారు. మూడు రోజుల ముందు నుంచే పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని, తాగునీటి సరఫరా చేయాలని, ఆయా అధికారులకు సూచించారు. రథం ఫిట్నెస్ను అటవీశాఖ అధికారులు తనిఖీ చేయాలని, ఆర్డీవో అటవీ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. తెప్పోత్సవం దగ్గర గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశించారు.
విజయనగరం ఉత్సవాలపై సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీని వేసి ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలో తదుపరి నిర్ణయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.50 లక్షలు కేటాయించిందని, నిధుల విడుదల కోసం డీవో లేఖ రాయడం జరిగిందన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి మాట్లాడుతూ సమన్వయంతో పనిచేసి పండగను విజయవంతం చేయాలని తెలిపారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాల కోసం రెండువేల మంది పోలీసులను నియమిస్తామన్నారు. అనంతరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.





