
అమెరికాకు భారత్, పాకిస్తాన్ ఒకటే అని చెప్పకనే చెప్పింది. అమెరికు చెందిన ఒక టాప్ జనరల్ మాట్లాడుతూ.. వాషింగ్టన్కు న్యూఢిల్లీ, ఇస్లామాబాద్తో బలమైన సంబంధాలను కలిగి ఉందని చెప్పారు. ఉగ్రవాదంపై అమెరికా పోరాటానికి ఆ ప్రాంతంలో భాగస్వామిగా పాకిస్తాన్ ఖచ్చితంగా అవసరమని అన్నారు. అమెరికా పాకిస్తాన్తో, భారత్తో సంబంధాలను కలిగి ఉండాలని, మనకు భారతదేశంతో సంబంధం ఉంటే, పాకిస్తాన్తో లేదని నేను నమ్మనని, దానికి ఉన్న సానుకూలత ఆధారంగా సంబంధాల ప్రయోజనాలను మనం చూడాలని అన్నారు.
హౌస్ ఆర్మ్ఢ్ సర్వీసెస్ కమిటీలో జరిగిన సమావేశం సందర్భంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ మైఖేల్ కురిల్లా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పాకిస్తాన్ ‘‘ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు’’ ఈ ప్రాంతంలో అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తుందని ప్రశంసించారు. పాకిస్తాన్ ను ‘‘అద్భుత భాగస్వామి’’ అని వర్ణిస్తూనే, వాషింగ్టన్ అందించిన పరిమిత నిఘా సహాయంలో ఐఎస్ఐఎస్-ఖొరాసన్ కు వ్యతిరేకంగా చురుకైన ఉగ్రవాద పోరాటం చేసిందని పాకిస్తాన్ని కొనియాడారు.
పాకిస్తాన్తో తమకు అద్భుతమైన భాగస్వామ్యం ద్వారా, వారు ఐఎస్ఐఎస్-ఖొరాసన్ను వెంబడించారని, ఉగ్రవాదులను చంపేశారని, ఇప్పటి వరకు పాకిస్తాన్ ఐదుగురు ISIS-ఖొరాసన్ హై వాల్యూ ఉగ్రవాదులను పట్టుకున్నారని యూఎస్ జనరల్ చెప్పారు. అబ్బేగేట్ బాంబు దాడి వెనక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరైన జాఫర్ని అప్పగించారని, ఈ విషయాన్ని ముందుగా తనకు చెప్పింది ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అని కురిల్లా చెప్పారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్తాన్ ప్రస్తుతం చురకైన పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.
అమెరికా సైనిక జనరల్ వ్యాఖ్యలు భారత్కి స్పష్టమైన సంకేతాలను పంపించినట్లు చూడాలి. అమెరికా తన భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల కొనసాగిస్తూనే పాకిస్తాన్ను మిత్రదేశంగా ఉంచుకుంటోంది. పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదంపై భారత్ చేసే పోరాటాన్ని, భారత సొంత పోరాటంగా చూస్తోంది.





