News

ఆ ఆలయంలో సెల్‌ఫోన్‌ నిషేధం..

269views

తమిళనాడు హైకోర్టు ఉత్తర్వుల మేరకు, కాంచీపురం కామాక్ష్మి అమ్మవారి ఆలయం లోనికి భక్తులు సెల్‌ఫోన్‌ తీసుకెళ్లడంపై నిషేధం విధించారు. భక్తులు తమ సెల్‌ఫోన్‌ భద్రపరచుకొనేలా ‘డిజిటల్‌ లాకర్‌’ సదుపాయం కల్పించారు. ఈ విషయమై ఆలయ అధికారులు మాట్లాడుతూ… ఆలయాల్లోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిందన్నారు.

ఆ ప్రకారం,కామాక్షి అమ్మవారి ఆలయంలోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లడంపై నిషేధం విధించామన్నారు. భక్తులు తమ సెల్‌ఫోన్‌ భద్రపరచుకొనేలా డిజిటల్‌ లాకర్‌ వసతి కల్పించామని తెలిపారు. ఆలయ తూర్పు, ఉత్తరం ప్రవేశ ద్వారం సమీపంలో ఏర్పాటుచేసిన డిజిటల్‌ లాకర్‌పై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ తమ సెల్‌ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేసి, తమ సెల్‌ఫోన్‌కు వచ్చే నాలుగు అంకెల పాస్‌వర్డ్‌ గుర్తుపెట్టుకొని, లాకర్‌లో సెల్‌ఫోన్‌ ఉంచి ఆలయం లోపలికి వెళ్లాలన్నారు.

దర్శనం ముగిసిన అనంతరం లాకర్‌పై స్ర్కీన్‌పై నాలుగు అంకెల పాస్‌ వర్డ్‌ నమోదుచేసి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లవచ్చని తెలిపారు. డిజిటల్‌ లాకర్‌లో సెల్‌ఫోన్‌ ఉంచేందుకు భక్తులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా రూ.10 చెల్లించాల్సి ఉంటుందని, ఒకే సమయంలో 1,000 మంది వరకు ఈ సదుపాయం వినియోగించేలా డిజిటల్‌ లాకర్స్‌ ఏర్పాటుచేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.