ArticlesNews

నమామి సత్యదేవాయ

44views

(మే 8 – అన్నవరం సత్యదేవుని కల్యాణం)

కాకినాడలోని అన్నవరం క్షేత్రంలో వెలసి.. మనల్ని నిరంతరం సన్మార్గంలో, సత్యమార్గంలో నడుపుతున్న దేవదేవుడు శ్రీసత్యనారాయణ స్వామి. స్కాంద, అగ్నిపురాణాలు సత్యస్వామి, అన్నవర క్షేత్రాలను వర్ణించాయి. ఈ స్వామి వ్రతకథలను సవివరంగా మనకందించాయి. తిరుమల తర్వాత అంతటి ప్రసిద్ధి గాంచింది అన్నవరం.

కాకినాడలోని అన్నవరం క్షేత్రంలో వెలసి.. మనల్ని నిరంతరం సన్మార్గంలో, సత్యమార్గంలో నడుపుతున్న దేవదేవుడు శ్రీసత్యనారాయణ స్వామి. స్కాంద, అగ్నిపురాణాలు సత్యస్వామి, అన్నవర క్షేత్రాలను వర్ణించాయి. ఈ స్వామి వ్రతకథలను సవివరంగా మనకందించాయి. తిరుమల తర్వాత అంతటి ప్రసిద్ధి గాంచింది అన్నవరం.

మేరుపర్వత పుత్రుడైన రత్నకుడు ఆ పరమాత్ముడు తన మీద నిలిచి ఉండాలనే కోరికతో ఘోర తపస్సు చేశాడు. శ్రీమహా విష్ణువు భక్తుని అనుగ్రహించేందుకు ఔషధాలకు నిలయమైన అంకుడుచెట్టు మొదట్లో విగ్రహరూపంలో ప్రతిష్ఠితమై తన కరుణా దృక్కులను భూమిపై ప్రసరింప చేస్తున్నాడు. అలా శ్రీహరి కోసం తాను గిరిగా మారి, రత్నగిరిగా పేరొందాడు.

స్వామివారి ఆజ్ఞతో గోరసం, కిర్లంపూడి జమీందార్లు 1891 ఆగస్ట్‌ 6న ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో సమయాన్ని సూచించే సూర్యస్తంభ నిర్మాణం ఉంది. గుడిలో గణపతి, శివుడు, నంది, ఆదిత్యుడు, అంబిక.. ఇలా పంచ దేవతామూర్తుల శిలారూపాలున్నాయి. ఈ ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కుల్లో నాలుగు చక్రాలున్నాయని, సూక్ష్మంగా పరిశీలిస్తే ఇదంతా కనిపిస్తుందని అగ్నిపురాణం పేర్కొంది. ఆలయం రెండు అంతస్తులలో నిర్మితమైంది. ఇక్కడ మహిమాన్వితమైన మహాయంత్రం ఉంది. మొదట కింది అంతస్తులో స్వామివారి పాదాలను, ఆలయ మూలస్తంభానికి నమస్కరించుకుని, తర్వాత పై అంతస్తులో కొలువైన స్వామివారిని దర్శించాలి. ఇక్కడొక మహత్తరమైన విషయం ఏమంటే.. సత్యనారాయణస్వామి, అమ్మ వారు, శివుడు ఒకే పీఠంపై దర్శనమిస్తారు.

శ్రీమన్నారాయణుని మరో రూపం, సత్యస్వరూపుడు, సత్యానికి సాక్షీభూతుడు, సత్య నిరూపకుడు అయిన ఈ వీర వేంకట సత్యనారాయణ స్వామిని సంక్షిప్తంగా సత్యదేవుడంటారు. సత్యానికి అర్థం, పరమార్థం సర్వం ఈ నామంలో ఇమిడి ఉంది. ఈ క్షేత్రంలోని అమ్మవారి పేరు అనంతలక్ష్మీదేవి. స్వామిని అమ్మవారితో కలిపి చెప్పే సందర్భంలో- లక్ష్మీ, అనంతలక్ష్మీ, రమా, సత్యవతీ- పేర్లను జోడిస్తారు.

త్రిమూర్తులు కొలువైన క్షేత్రం
స్వామి రూపం త్రిమూర్త్యాత్మకం. స్వామి రూపంలోనే త్రిమూర్తులు నిక్షిప్తమై నిలిచారు. అన్నవరంలో ప్రధాన దేవుడు విష్ణువే అయినా పరమశివుడు, బ్రహ్మదేవుడు కూడా కొలువై ఉండటంతో హరిహర క్షేత్రంగానూ, త్రిమూర్తి క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది. పీఠం మీద మాత్రం స్వామికి కుడివైపున శివుడు, ఎడమవైపున అమ్మవారు ఉన్నారు.
మీసాల దేవుడు

సత్యం + నారాయణం కలగలిసిన సత్యనారాయణుడు వీరత్వానికి ప్రతిరూపం, పాపప్రక్షాళకుడు. వీరానికి గుర్తుగా ఈ దేవునికి పెద్ద మీసాలుంటాయి. ఇలా మీసాలున్న దైవరూపం అరుదు. సత్యం మహాధర్మమని నమ్మే భక్తులకు ఈ స్వామి అనుగ్రహం తక్షణం లభిస్తుంది. నిజానికి సత్యం అంటే అసత్యం కానిది మాత్రమే కాదు వికార శూన్యమైంది. ఇది వైరాగ్యానికి మరోరూపం. అందుకే ఈ దేవుని ఆరాధిస్తే వైరాగ్య జ్ఞానాలు సిద్ధించి మోక్షప్రాప్తి కలుగుతుంది.

వివిధ సందర్భాల్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా! ఈ వ్రత విధానాన్ని, కథలను స్వయంగా శ్రీమహావిష్ణువు నారదమహర్షి ద్వారా మనకు అందించాడు. ఇది మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. వ్రతాచరణకు కుల, మత, వర్గ, జాతి భేదాల్లేవు. చదువు, సంపదలు, శ్రేయస్సు, ఆరోగ్యం, శాంతి, కుటుంబ సౌఖ్యం, వ్యాపారంలో విజయం పొందేందుకు స్వామివారి వ్రతం చేసుకుంటారు. పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాల అనంతరం ఇంట్లో తప్పనిసరిగా సత్యనారాయణస్వామి వ్రతం నోచుకుంటారు. ముందుగా నవగ్రహ దేవతలను, అష్ట దిక్పాలక దేవతలను శాస్త్రోక్తంగా పూజించిన తర్వాత వ్రతం మొదలవుతుంది. ఈ వ్రతం వల్ల ఆధ్యాత్మిక చింతనే గాక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

సర్వదా చేయదగ్గ వ్రతం
సాధారణంగా ఈ వ్రతం కార్తికమాసంలో.. ఆదివారం, దశమి, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో నిర్వహిస్తారు. ఆ రోజులు ప్రసిద్ధమైనప్పటికీ.. నిజానికి ప్రతి రోజూ వ్రతాచరణకు యోగ్యమైందే. వ్రతకథలు అయిదు. వీటిని చదివినా, విన్నా, వ్రతం చేసినా, చూసినా శుభదాయకం. పాపం హరిస్తుంది, పుణ్యం లభిస్తుంది. స్వామివారి ఈ వ్రతాన్ని మొట్టమొదటగా చేసింది శ్రీరామచంద్రుడు. మరో విశేషం- అన్నవరానికి క్షేత్ర పాలకుడు శ్రీరాముడే. మనం కోరుకున్న.. అనుకున్న వరాలను ఇచ్చే స్వామి కనుక ఈ క్షేత్రానికి అన్నవరం అనే పేరు ఏర్పడిందని పెద్దలు చెబుతారు.

సత్యనారాయణస్వామికి అన్నవరంలోనే కాక రాజమండ్రి, ఏలేశ్వరం, ర్యాలి, ద్రాక్షారామంలోను ఆలయాలున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఆదిబద్రీ, కాశీ, హరిద్వార్, రుషీకేశ్‌ మార్గంలోనూ స్వామివారి ఆలయాలున్నాయి. గుజరాతీ, మరాఠీ, కన్నడ, కశ్మీరీ, హిందీ, సంస్కృతాది భాషల్లో ఈ వ్రత కథలు అనువాదమై.. ఆయా రాష్ట్రాలవారంతా ఈ వ్రతం చేసుకుంటున్నారు. ఈ వ్రతాన్ని వ్యక్తిగతంగా ఇళ్లల్లో చేసుకోవడం సంగతలా ఉంచి.. సామూహికంగా నిర్వహించే ఆచారముంది. ఇది కుటుంబ భద్రతనూ, సమాజ ఐక్యతనూ సమకూరుస్తుంది.
సత్యాన్నే స్వరూపంగా కలిగి, సత్యానికి మూలస్థానమై, సత్యాన్నే నేత్రాలుగా నిలిపి, సత్యాన్నే నామంగా ధరించి, సత్యాన్ని ఆశ్రయించిన వారికి అండగా నిలిచిన సత్యనారాయణస్వామీ! నిన్ను శరణు వేడుతున్నాను- అంటూ స్వామి వారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తారు.