
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పెద్ద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఇకపై హిందూ మతంలో భాగం కాదని ఆయన అన్నారు. అతన్ని హిందూ మతం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు. బద్రీనాథ్లోని శంకరాచార్య ఆశ్రమంలో స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నిత్యం హిందుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మనుస్మృతికి సంబంధించి రాహుల్ గాంధీ పార్లమెంటులో చేసిన ప్రకటన సనాతన ధర్మ అనుచరులందరినీ బాధపెట్టిందన్నారు. అత్యాచార నిందితులను రక్షించే సూత్రం మనుస్మృతిలో ఉందని రాహుల్ గాంధీ పార్లమెంటులో చెప్పారని శంకరాచార్య గుర్తు చేశారు.
ఈ అంశంపై మూడు నెలల క్రితం రాహుల్ గాంధీకి నోటీసు పంపామని, మనుస్మృతిలో ఏం రాశారో స్పష్టం చేయాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సమాధానం రాలేదని అవిముక్తేశ్వరానంద చెప్పారు. ఓ వ్యక్తి హిందూ గ్రంథాలను తరచూ అవమానిస్తూ.. దానికి సంబంధించి ఇవ్వకుండా ఉంటే, అతనికి హిందూ మతంలో స్థానం ఉండదన్నారు. తనను తాను హిందువు అని చెప్పుకునే అర్హత రాహుల్ గాంధీకి లేదన్నారు. కాగా.. శంకరాచార్య చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
కాగా.. భారతీయులు ఇష్టంగా పూజించే దైవం శ్రీరాముడు. ఈ దేశంలోని ఏ ఊరికి వెళ్లినా రామాలయం ఉంటుంది. అలాంటి రాముడి గురించి కాంగ్రెస్ నేతలు తరచూ తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటే.. భారతీయ భక్తులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. రాముడి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాముడు సహా భారతీయ దేవుళ్లను.. పురాణ రూపాలు అని చెప్పడం కలకలం రేపింది. అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీలో రాహుల్ ఈ వ్యాఖ్య చేశారు.





