News

వక్ఫ్‌ పిటిషన్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

286views

తాజాగా భారత సర్కారు ఆమోదించిన వక్ఫ్‌ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను రేపటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అయితే, పిటిషన్ దార్లు కోరినట్టు వక్ప్ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ సీజేఐ(చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా) నోటీసులు జారీ చేశారు. గురువారం మ.2 గంటలకు మళ్లీ విచారణ చేపడతామని.. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది.

వక్ఫ్ బిల్లు పిటిషన్ల విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. “సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం. ఇది పలు మార్లు దుర్వినియోగమైంది. అయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది.

పిటీషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించగా, కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జేపిసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామని.. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేనని.. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని తన వాదనలు కోర్టు ముందుంచారు.

కాగా, కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్టం అమలును నిలిపివేయాలని వేసిన పిటిషన్లపై కేంద్రం కేవియెట్‌ పిటిషన్‌ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.