News

చర్చ్ పాస్టర్‌ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

320views

పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో ఒక చర్చ్ పాస్టర్ మీద లైంగిక వేధింపు కేసు నమోదయింది. పాస్టర్ బజీందర్ సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఒక యువతి ఫిర్యాదు చేసింది. బజీందర్ సింగ్ పాడిన ‘మేరా యేసూ యేసూ’ పాట వీడియో బాగా వైరల్ అయింది. అప్పటినుంచీ అతని ప్రజాదరణ బాగా పెరిగిపోయింది.

బాధిత యువతి జలంధర్ జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తోంది. 2017 అక్టోబర్ నుంచీ తన తల్లిదండ్రులతో కలసి చర్చ్‌కు వెడుతోంది. అక్కడే ఆమెకు బజీందర్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. అతను ఆ యువతి మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. కొన్నాళ్ళకు మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టాడు. బజీందర్ సింగ్‌కు భయపడి, ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోయానని బాధితురాలు చెప్పింది.

2022 నుంచీ బజీందర్ సింగ్ ఆమెను ఆదివారాల్లో చర్చ్‌లో ప్రార్థన పేరిట పిలిచేవాడు. ఒక క్యాబిన్‌లో ఏకాంతంగా కూర్చోబెట్టి, ఆమెను కౌగిలించుకోవడం, అసభ్యంగా ముట్టుకోవడం చేయడం మొదలుపెట్టాడని బాధితురాలు పోలీసులకు వివరించింది.

బజీందర్‌ సింగ్‌కు సామాజిక మాధ్యమాల్లో మంచి ఆదరణే ఉంది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అతని కంటెంట్ తరచుగా కనిపిస్తుంది. కొన్నాళ్ళుగా అతనికి చంకీపాండే, ఆదిత్య పంచోలి వంటి సెలబ్రిటీలు కూడా ఎండార్స్ చేస్తున్నారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపులు, నేరబుద్ధితో బెదిరింపులు, వెంబడించడం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసారు.